మా కాశీ మజిలీ కథ..(1)
"విశ్వనాథునికి దేవ దీపావళి మహోత్సవం" అని సంకల్పం జరిగిన నాటి నుండి మనసులో ఒకటే అలజడి. ఎప్పుడెప్పుడు ఆ కాశీ విశ్వనాథుని ముందు వాలతానా అని..
అనుకున్నదే తడవుగా టికెట్ల కోసం వేట ప్రారంభించాం.వెయిటింగ్ లిస్ట్ ఉన్నా బుక్ చేశాము.కానీ అవి ఒక్క టికెట్ కూడా ముందుకు కదలడం లేదు.సరే మన ప్రయాణం 10 నవంబరు తర్వాత కదా, 6 నవంబర్ వరకు సమయం ఉంది కదా అని వేచి చూడాల్సిందే అని నిర్ణయించుకున్నాం.
కానీ దేవ దీపావళి మహోత్సవానికి లక్ష పైన దీపాలు వెలిగించాలనే సంకల్పం, నా ఒక్కదాని వల్లా అవుతుందా అనే అనుమానం అనుక్షణం వెంటాడుతూ ఉన్న రోజులు వచ్చాయి..
హైదరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళ వరకు ఈ సంబరం గురించి తెలియజేశాము. ఈ పని మీద ఒకటికి రెండు సార్లు ఆ ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. చాలా మంది ఫేస్బుక్, వాట్సాప్,ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మాధ్యమాల నుంచి ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని దేవ దీపావళి నిమిత్తం పెట్టిన అసంఖ్యాక దీపారాధన కోసం తమ శక్తి కొలది గోత్రనామాల మీద పైకం పంపారు..
ఇప్పుడు బాధ్యత మరింత పెరిగింది అని అర్థం అయింది.. కానీ టికెట్ల సంగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది.టెన్షన్ భరించలేక మా కారులోనే వెళ్ళి వచ్చేద్దాం అని ఒకరికొకరు మొండి దైర్యం కలిగించేలా మాట్లాడుకుంటూ ఉన్నాం!!
ప్రతి రోజూ గూగుల్ మ్యాప్ తెరిచి ఈ సమయానికి బయలుదేరితే ఎప్పటికి కాశీ చేరుతాం,ఈ మధ్యలో ఉన్న అటవీ ప్రాంతానికి ఎన్ని గంటలకు చేరతాం,ఈ ఘాట్ రోడ్డు దాటటానికి ఎంత సమయం పడుతుంది అంటూ లెక్కలు వేస్తూనే ఉన్నాం.పసి పిల్లాడు, డ్రైవింగ్ విషయంలో నా మీద నాకు పూర్తిగా నమ్మకం లేకపోవడం, ఒక్కరే 1300కి.మీ లు కారు నడపడం అంటే కష్టం..ఇలా ఏవేవో భయాలు మనసులో మెదులుతూనే ఉన్నా పైకి మాత్రం "ఫర్వాలేదు మనం కారులో వెళ్ళగలం" అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాం.
నవంబర్ 6వ తారీఖు రానే వచ్చింది.మా వారు పొద్దున్నే లేచి గత మూడు నెలలుగా చెక్ చేస్తున్నట్టే ఆ రోజు కూడా టికెట్లు చూశారు.ఇంకా అదే సంఖ్య దగ్గర హఠం వేసుకుని కూర్చుంది పరిస్థితి.ఇహ లాభం లేదని క్యాన్సిల్ చేసేశారు.సరే పోనీ ఫ్లైట్ లో అయినా చూద్దాం అని టికెట్లు బుక్ చేస్తుంటే దాదాపు 50,000₹ దాకా లెక్క తేలింది.ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ, ముందుకు సాగుతున్న సగటు మధ్యతరగతి కుటుంబానికి 50,000₹ అనేది ఒక నెల బడ్జెట్. పోనీ ఏ అప్పో సొప్పో చేద్దామని బుకింగ్ మొదలు పెడితే ముగ్గురికీ తలో దిక్కు సీట్లు ఇచ్చాడు.మనకి కావాల్సిన సీటు కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అని తెలియడంతో కొంచెం గర్వభంగం అయినంత పని అయింది.ఈ పరిస్థితి మొదటి సారి విమానయానం వారికి కొత్త కాబట్టి మాకు కొత్తతో పాటు ఏదో తెలియని బాధ కూడా కలిగి క్యాన్సిల్ చేసేశాం..
పోనీ కారులోనే ఎవరినైనా డ్రైవర్ ని పెట్టుకుందాం అనుకున్నాం.మా "Pickles And Podis" డెలివరీ చేసే నిఖిల్ ని అడిగితే విమాన ఛార్జీలకు దరిదాపుల్లో చెప్పాడు బత్తా!! ఇహ ఇలా కాదని మా కారు మేమే తోలుకుంటూ, నాగ్ పూర్ లో రాత్రి బస చేసి, తెల్లవారుజామున మళ్ళీ బయలుదేరితే సరిపోతుంది అని దృఢంగా నిశ్చయించుకున్నాము..
ఇంతలో మా అమ్మకి దగ్గరలోని శక్తి పీఠం దర్శించి,దసరాలో చేయలేకపోయిన పారాయణ పూర్తి చేయాలని కోరిక కలిగింది.సరే రెండు రోజుల్లో వెళ్దాం అని ఆవిడకి చెప్పి పనుల్లో నిమగ్నమై ఉన్నాము.కానీ ఏ పరీక్షో తెలియదు హఠాత్తుగా నా నడుం పట్టేసి, లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయా.మందులు వేస్తున్నా నిలుచోలేని అవస్థలో ఉన్నా.మా వారికి ఒకటే దగ్గు, జ్వరం. మందులు వేస్తూ, నిద్రావస్థలో ఉండిపోతున్నారు ఆయన కూడా!!
అమ్మకి చెప్పిన రెండు రోజులు దాటి మూడో రోజుకి వచ్చినా నా పరిస్దితి అలాగే ఉంది. మా బాబు కోసం లేవడం అయితే లేచా గానీ కుంటుతూ పనులు మొదలుపెట్టా. ఈయన లేవనే లేదు అసలు..ఈ లోపు మధ్యాహ్నం రెండు గంటలకు మా అమ్మ ఫోన్ చేసి "నేను జోగులాంబ దేవాలయం, ఆలంపూర్ వెళ్ళి వచ్చేస్తా.మీరు కోలుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం" అంటూ ఫోన్ పెట్టేసింది..
కానీ అమ్మ మేము లేవలేదేమో అని మా ముగ్గురి కోసం భోజనం తీసుకొచ్చింది.ఆవిడ అలా ఒక్కరే వెళ్తా అనడంతోనే నా మనసు బాధ పడింది.పైగా మా కోసం భోజనం తీసుకొచ్చి మరీ వెళ్ళిపోతానంటే ఏడుపు ఆగలేదు.మా వారిని నెమ్మదిగా "వెళదామా?? డ్రైవ్ చేయగలరా?" అని అడగ్గానే " నువ్వు కూర్చోగలవా? నడుం నొప్పి తగ్గితే పదా వెళ్దాం" అన్నారు.. ఎగిరి గంతులు వేసినంత ఆనందం కలిగింది. ఒక్క గంటలో తయారు అయి కారులో బయలుదేరాం. పోనీలే కాశీ ప్రయాణానికి కావలసిన రిహార్సల్ ఇది అనుకుని మొండిగా ఆలంపూర్ బయల్దేరాం..
అమ్మవారి పరీక్షో ,దయనో తెలియదు గానీ రాత్రి 8.30నిమిషాలకు ఆలంపూర్, జోగులాంబ దేవాలయానికి చేరుకున్నాం.సరిగ్గా అదే సమయం ఆలయం తలుపులు మూసి, అమ్మవారికి దిష్టి తీసి, తాళాలు వేసే సమయం. ఇహ దర్శనం లేదనుకుని నిరుత్సాహపడే సమయానికి ఎవరో అయ్యప్ప స్వాములు మినిస్టర్ రికమండేషన్ తో వచ్చారు.వారి కోసం తలుపులు తీయడంతో మేము కూడా దూరి మరీ వెళ్ళిపోయాం.లోపలికి వెళ్ళాక అమ్మ వారి దగ్గర గేటు లోపలకు మా వారిని,మా బాబుని రానిచ్చి, నన్ను, అమ్మని రానీయకుండా గేటు వేసేశారు.అదేంటని అడిగితే ఇక్కడి దాకా రావడమే ఎక్కువ అన్నాడు ఆ మినిస్టర్ తాలుకా మనిషి. కానీ అమ్మవారి కోసం అమ్మ, నేను చీర, తాంబూలం తీసుకెళ్ళాం . అవి చేతిలో ఉన్న సంగతే గుర్తు లేదు మాకు.అవి చూసి అక్కడి బ్రహ్మ గారు గేటు తాళం తీయించి, రసీదు రాయించి చూడండి అంటూ అమ్మవారిని చూపించారు. నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు.ఈ మధ్య ఏ దేవీ దేవతల దర్శనం చేసుకున్నా నా పరిస్దితి ఇదే.. కళ్ళు నీళ్ళతో నిండిపోయి ఆ దేవుని రూపం చూడలేకపోవడం.కానీ తమాయించుకుని కళ్ళు తుడుచుకుని చూసే స్పృహ వచ్చింది.అమ్మవారిని కళ్ళారా చూశాం.
ఇక దర్శనం అయింది అనుకునే లోపు "అమ్మవారికి దిష్టి తీయాలి త్వరగా రండి మేడం..రండి" అని ఒకటే అరుపులు ఆ మినిస్టర్ మనిషి. సరిగ్గా అప్పుడే నా నడుం,కాలు మళ్ళీ పట్టేసాయి.అడుగు వేయలేక ఏడుపు వచ్చేస్తోంది కానీ తప్పదు అనేంత కేకలు పెట్టేస్తున్నాడు ఆ మనిషి.ఇహ చేసేది లేక కాలు,నడుం ఈడ్చుకుంటూనే బయటికి వచ్చా.నా పరిస్థితి అప్పటికి గానీ అర్ధం కాని ఆ మనిషి "సారి" అన్నట్టు దండం పెట్టి తలుపులు మూసేసాడు.. మా వారి దగ్గరకు వచ్చి "ప్రొటోకాల్ ప్రకారం మళ్ళీ తలుపులు తీయడం నేరం సార్, మినిస్టర్ రికమండేషన్ కాబట్టి వారి కోసం తీయక తప్పలేదు.సమయానికి తలుపులు వేయకపోతే మాకు ప్రాబ్లం సార్.మా వల్ల మీకు కూడా దర్శనం అయింది" అంటూ చెప్పుకొచ్చాడు..
**అమ్మవారు పిలిపించుకోవాలి అనుకుంటే ఆవిడ ముందు ఆ మనిషెంత?? మేమెంత??**
అలా ఆలంపూర్ నుంచి వెనుదిరిగి ఇల్లు చేరేసరికి తెల్లవారుజాము అయింది.ఆ రోజు మేము నిద్ర లేచేసరికి మధ్యాహ్నం మూడు గంటలు దాటింది.అప్పుడు ఏదో వండి పెట్టి మా వారిని,మా బాబుని లేపి భోజనాలు మమ అనిపించాం. కానీ ఒకటే ఒళ్ళు నొప్పులు!!
ఈ దెబ్బకి కాశీ కారులో అంటే ఎలా?? అని మళ్ళీ మొదటికి వచ్చింది యక్ష ప్రశ్న!!!
ఇహ లాభం లేదని మా వారు హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ వందే భారత్ లో బుక్ చేసి, అక్కడి నుంచి ముజాఫర్ పూర్ వయా మొగల్ సెరాయ్ వెళుతున్న రైల్లో టికెట్లు సంపాదించారు.. మరి తిరుగు ప్రయాణం?? అసలు నవంబర్ 15 దేవ దీపావళి తర్వాత నవంబర్ 18 వరకు కాశీ నుంచి ఏ వైపు కూడా టికెట్లు లేవు. ఇలా కాదని మా వారు ఏకంగా ఢిల్లీకి వారణాసి నుంచి వందే భారత్ బుక్ చేశారు.అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ కి టికెట్లు సంపాదించారు..
హమ్మయ్య!!!
*******(ఇంకా ఉంది)********
బావ గారూ ప్రతిజ్ఞాస్త్రం చేతబూని , ట్రైన్లని వెంటాడి వేటాడి మీకు బెర్తులు బుక్ చేయ్యడంలో నంది పాత్రని వహించి మిమ్మలని విశ్వనాదుని చెంతకు చేర్చాడు .... మీ కాశీ ప్రయాణం బాగుందక్కా ..I loved it 💕
ReplyDelete