కాశీ ప్రయాణం ఎలా చేయాలి!! (మొదటి భాగం)
మొదటి సారి కాశీ క్షేత్రంలో అడుగు పెట్టాలి అని ఆలోచన రావడమే మన పూర్వ జన్మ సుకృతం అనుకోవాలి.శివుడు అణువణువునా నింపుకున్న మహాక్షేత్రం కాశీ.మహాశివుని మొదటి భక్తుడైన శ్రీ మహావిష్ణువు హృదయం కాశీ.సమస్త దేవతలు నడయాడే పుణ్య క్షేత్రం కాశీ.గంగా తీర్థం ప్రవహించే పుణ్య దేశం కాశీ. తీర్థము+ క్షేత్రము కలిసి యుగయుగాలుగా నిలిచి ఉన్న మహిమాన్వితమైన పుణ్య తీర్థం కాశీ..
ఇక్కడికి చేరుకోవడం కేవలం కాలభైరవుని అనుమతి ఉంటేనే సాధ్యం అవుతుంది అనేది కాదనలేని సత్యం. ఈ క్షేత్రంలో పుట్టడం ఎంత అదృష్టమో, ఇదే క్షేత్రంలో చనిపోవడం కూడా అంతే అదృష్టం అని వేద వాక్కు!!
ఇది వరకు ప్రభుత్వాలే మలి దశలో ఉన్న వృద్ధులకు భోజన వసతి సౌకర్యాలు కలిపించి, వారు కాలం చేస్తే గంగా నదిలో ప్రత్యేకంగా నియమించిన పడవల్లో వారి అంతిమ సంస్కారాలు చేసే కర్త వచ్చేవరకు ఉంచేవారు. ఆ తర్వాత్తర్వాత కాలానుగుణంగా ఈ పద్ధతి మార్చి కర్త వచ్చేవరకు ఫ్రీజర్/కూల్ బాక్స్ సౌకర్యం ఏర్పాటు చేశారు కానీ వృద్ధుల కోసం ఉన్న సౌకర్యాన్ని మాత్రం అనేక కారణాల రీత్యా తొలగించారు.ప్రభుత్వేతర సేవలు మాత్రం చాలా ఉన్నాయి.చిన్న చిన్న గదులు అద్దెకు ఇచ్చి అక్కడి ప్రజలు కూడా ఎంతో కొంత సంపాదించుకుంటూ అవసాన దశలో ఉన్న ఎందరో వృద్ధులకు ఆశ్రయం కలిపిస్తున్నారు.ఎన్నో ఆశ్రమాలు కూడా వివిధ రకాల ప్యాకేజీలు అందిస్తున్నాయి ఇలాంటి వారి కోసం!!
అయితే ఎందరో భాగ్యం లేనివారు కాశీ నుంచి ఏ శుభకార్యానికో,పరామర్శకో ఊరు దాటగానే కాలం చేసినవారు ఉన్నారు.పెళ్ళి కోసం వచ్చిన వాళ్ళు,మనవళ్ళు విదేశాలనుంచి వచ్చారని తెలిసి చూసి వెళ్దాం అనుకునేవారు కాశీ నుంచి రాగానే వారి వారి స్వస్థలాల్లో కాలం చేస్తూ ఉండటం చూసి చాలా మంది "కాశీలో మరణించడం కూడా అదృష్టమే..ఆ భాగ్యం అందరికీ ఉండదు" అంటూ ఉండటం మనందరం గమనించే ఉంటాము.
అసలు కాశీలో మరణానికి ఎందుకు అంత ప్రాధాన్యత??
ఎందుకంటే సాక్షాత్తు శివుడు, విష్ణు మూర్తి, అమ్మవారు, గణపతి,సకల దేవతలు,శివ గణాలు ఆనందంగా పులకించే క్షేత్రం కాశీ.ఇక్కడ శరీరం వదిలిన జీవుడిని అమ్మవారు నేనున్నా అంటూ ఒడిలో పెట్టుకొని ఉండగా, వినాయకుడు తొండంతో నిమురుతూ,గంగా దేవి మోక్ష ప్రాప్తికి తీర్థంగా గొంతులో చేరుతూ ఉండగా,నంది,భృంగి రకరకాల నాట్యాలు చేస్తుండగా మహాదేవుడు తన ప్రమద గణాలూ మంగళ వాయిద్యాలతో, డప్పులు, దరువులతో, ఢమరుక నాదాలు, శంఖ ధ్వానాలతో వచ్చి జీవుడి చెవిన తారక మంత్రం చదివి తనతో పాటు కైలాసానికి తీసుకుని వెళతాడని వేదాలు చెబుతున్నాయి.. ఇహ ఆ జీవుడికి జనన మరణ చక్రంలో పడి కర్మ అనుభవించే అవస్థ ఉండదు.పైగా శివ సాన్నిధ్యానికి మించిన మోక్షం మరొకటి ఉంటుందా??
ఇంతటి అదృష్టం ఎంతమందికి కలుగుతుంది??
అందుకే కాశీలో పుట్టడం ఎంత అదృష్టమో.. మరణించడం అంతకు మించిన అదృష్టంగా సనాతన ధర్మం చెబుతుంది!!
పూర్వం కాశీ ప్రయాణం అంటే వానప్రస్థంగా వృద్ధాప్యం వచ్చాక, పిల్లలు,మనవల దగ్గర సంతోషంగా సెలవు తీసుకుని వెళ్ళేవారు.తిరిగి రావడం/రాకపోవడంతో సంబంధం లేకుండా పిన్నలు కూడా అదొక వేడుకలా చేసి పంపేవారు. తిరిగి వస్తే మరో వేడుకలా ఊరంతా పిలిచి అన్నసంతర్పణ చేసేవారు.రాకపోతే కైలాసానికి చేరారని తలుస్తూ ఉండేవారు. జ్ఞాన వైరాగ్యం మన సంప్రదాయంలో ప్రత్యేకంగా నేర్పే విద్య కాదు.అది మన జీవన శైలి లో భాగంగా నేర్పేవారు!!
ఇటువంటి పరిస్థుతులు ఇప్పుడు లేవు.ప్రయాణ సాధనాలు పెరగడం, అన్ని చోట్లా ఆహార సౌకర్యాలు పెరగడంతో అంత కష్టతరమైన యాత్రగా అనిపించదు ఇప్పటి "కాశీ యాత్ర". కానీ అప్పుడూ - ఇప్పుడూ కూడా కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడే!! ఆయన అనుగ్రహం లేని కాశీ యాత్ర సఫలం అవడం కల్ల.. ఒకవేళ కాశీ ప్రయాణం చేయాలి అనే తలంపు రాగానే ముందుగా కాలభైరవాష్టకం చదవడం మొదలుపెట్టమని నా స్వానుభవంతో చెబుతున్న మాట..
ఇహ ప్రయాణ వివరాలు అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలా ఏ స్టేషన్ నుంచి అయినా వారణాసికి రైళ్ళు ఉన్నాయి.లేదా విమాన సర్వీసులు కూడా ఉన్నాయి.ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరకని పక్షంలో నాగ్ పూర్,ఇటార్సీ వంటి జంక్షన్ల వరకు వచ్చే ఏ రైలు అయినా బుక్ చేసుకోవచ్చు.అక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వారణాసికి రైళ్ళు పుష్కలంగా ఉన్నాయి...ఒక వేళ బస్ ప్రయాణం అనుకున్నా కూడా నాగ్ పూర్ నుంచి కొన్ని సర్వీసులు ఉన్నాయి!! ఒక్కో మనిషికి రాను-పోను దరిదాపుగా 10,000₹ టికెట్ ఖర్చులు మాత్రమే అవుతాయి.. విమానం లో ఇంకొంత ఖర్చు అధికం కానీ సమయం ఆదా అవుతుంది.కేవలం రెండు గంటల్లో విమాన ప్రయాణం వారణాసి చేరిస్తే, రైలు/బస్సు 36గంటల ప్రయాణం పడుతుంది.రైళ్ళ రాకపోకలు లేట్ అయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది!!
ఇన్ని గంటల ప్రయాణం అంటే పిల్లలు, పెద్దలు ఉన్నప్పుడు బయట ఆహారం మీద ఆధారపడటం ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా కూడా కొంత భారం పడుతుంది. కొంచెం ఆలోచించి పులిహోర, అటుకులు,పూరీ, రోటీ,ఏదో రెండు రకాల ఊరగాయలు, బిస్కెట్లు, పళ్ళు దగ్గర ఉంచుకోవడం ఉత్తమం.బాదం, జీడిపప్పు కిస్మిస్ కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి.నేను Instant coffee, పంచదార, అమూల్ పాల పొడి,ఒక లీటరు నీళ్ళు కాచేంత కెటిల్ కూడా తీసుకెళ్ళాను.మా నానికి అటుకులు, పాలు, పంచదార కలిపేసి ఇచ్చాను.మేము కూడా రెండు మూడు సార్లు కాఫీ తాగ గలిగాం. తప్పదు మరి పిల్లలతో ప్రయాణం అంటే!! పైగా కొంతమంది పిల్లలు పెట్టింది తినే రకం కాదు - చూజీగా ఉంటూ కొంత ఇబ్బంది పెట్టేవారు అందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి.
ఈ మధ్య ట్రైన్ లో కూడా స్విగ్గీ,జొమాటో, రైల్ రెస్టో, రైల్ ఖానా లాంటి యాప్స్ ట్రైన్ ఆగే స్టేషన్ ల దగ్గరికి వేడిగా ఆహారాన్ని డెలివరీ చేస్తున్నారు.కానీ ఇవి కొన్ని నిర్దిష్ట స్టేషన్లకు మాత్రమే పరిమితం చేశారు. అందులోనూ ట్రైన్ ఆలస్యం అయితే ఈ సర్వీసులు కూడా ఏమీ ఉపయోగపడవు.కేవలం PNR number,Bearth Number తో ఏ స్టేషన్ లో ఏ ఆహారం అందించగలరు అనే సమాచారం ఈ యాప్స్ లో ఉంటుంది. Cash On Delivery సౌలభ్యం ఉపయోగించుకుంటే ఒకవేళ డెలివరీ సమయానికి రాకపోయినా, ఆహారం అందకపోయినా డబ్బులు వేస్ట్ అనే బాధ ఉండదు.ముందే చెల్లించేసినా ఎటువంటి ఇబ్బంది కలిగినా మన డబ్బులు మన ఖాతాలోకి రెండు రోజులలో పంపించేస్తారు... కానీ నా స్వానుభవంతో చెబుతున్న మాట ఏమిటంటే ఈ రైలు ఆహారం, బయటి ఆహారం ఆరోగ్యానికి మహా హానికరం!!
100% ఫుడ్ పాయిజన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది.కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే ఇటువంటి ఆహారం ఎంచుకోండి!!
ఇక కాశీ చేరాక అక్కడి ప్రతి డ్రైవర్, హోటల్,సత్రం,బోటు,చీరల దుకాణాలు ఒకరితో ఒకరు అనుసంధానం చేసుకునే పని చేస్తారు.మీరు కట్టే ప్రతి రూపాయిలో వాటాలు ఉంటాయి.ఇది బహిరంగంగా జరిగే వ్యవహారమే. హోటల్ రూం మీరు ముందుగానే బుక్ చేసుకున్నా ఆ హోటల్ లో మీ రూం అదే ధరకు ఉంటుంది అనుకోకండి.ఫుల్ అయిపోయాయనో, బుక్ అవలేదనో రూపాయికి పది రూపాయలు వసూలు చేయడం, అందులో మళ్ళీ మిమ్మల్ని తీసుకుని వచ్చిన డ్రైవర్ కి వాటా ఇవ్వడం అంతా చాలా సహజం అక్కడ!! మనం నిలదీసి, నిరూపించే సీన్ ఉండదు.. కాబట్టి వాడు పది రూపాయలు చెబితే రెండు రూపాయల నుంచి బేరం మొదలు పెట్టడమే మన చేతుల్లో ఉంటుంది.
మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలు, రిక్షాలు పుష్కలంగా దొరుకుతాయి.కానీ ఎక్కిన దగ్గర నుంచి మీ చెవిలో జోరీగ లాగా చీరలు కొనమని,మా బాబాయ్ షాప్ అని, హోల్ సేల్ అని నానా మాటలు చెప్పి మిమ్మల్ని బుట్టలో పడేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి.నేను కూడా అలా బుట్టలో రెండు సార్లు పడి మరీ షాపింగ్ చేసా అనుకోండి. కానీ బేరం మాత్రం చాలా ముఖ్యం లేదంటే రూపాయి వస్తువు పదికి కొని తలా ఇంత కమీషన్ పాలు చేసేస్తాం!!
అక్కడ పాడి పరిశ్రమ పుష్కలంగా ఉంటుంది కాబట్టి పాలు, పెరుగు,పాల పదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయి.పొద్దున్నే సమోసాలు,జిలేబీలు,కచోరీలు తినడం చూసి ఆశ్చర్యపోకండి..మన దక్షిణ భారత టిఫిన్లు కూడా ఎక్కడికక్కడే దొరుకుతాయి. ముఖ్యంగా ఇడ్లీలు, దోశలు అయితే బాగానే దొరుకుతాయి.కాకపోతే మన రుచి ఉండవు!! తప్పదు మరి..మన ఇంట్లో చేసినట్టు అన్ని చోట్లా ఉంటాయా అంటారు "ఏమండీలు"..
ఇక దర్శనం కోసం అయితే నా చిన్నప్పుడు చూసిన కాశీకి, ఇప్పుడు మోదీ గారు మార్చిన కాశీకి ఎంతో తేడా ఉంది.కొన్ని రహదారులు మూసేసి కేవలం కాలినడక పెట్టారు. ఎవరు ఎటు వెళ్ళినా నంది సర్కిల్ బాగా గుర్తు ఉంచుకోవాల్సిన బండ గుర్తు. నంది ముఖం వైపు గుడి ఉంటుంది.నంది కుడి వైపు గుడిలో నుంచి బయటకు వచ్చే మార్గం.నంది వెనుక, నంది ఎడమ వైపు కాశీ పట్టణానికి దారులు. నంది ముఖం వైపు నడుస్తూ ఉండగా ఓ రెండు మీటర్ల తర్వాత దర్శనం టికెట్ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది.ఎవరిని అడిగినా చెబుతారు.అక్కడ వివిధ రకాల దర్శనం,సేవ ప్యాకేజీలు ఉంటాయి. టికెట్ బుక్ చేసుకుని, తిన్నగా వెళ్ళి గేటు నెంబర్ 4 దగ్గరకు వెళితే అక్కడి సెక్యూరిటీ మనకి ప్రత్యేక క్యూ చూపిస్తారు.క్యూ నేరుగా దర్శనం వరకు ఉంటుంది..
లేదు ఫ్రీ దర్శనం కూడా వెళ్ళవచ్చు..ఇది గేటు నెంబర్ 1. అక్కడి పోలీసులు, షాప్ వాళ్ళు ఎవరిని అడిగినా చూపిస్తారు మనకి. ఫ్రీ దర్శనం అయినా కూడా ఎక్కడా వెయిటింగ్ ఉండదు.నేరుగా దర్శనం వరకు వెళ్ళడానికి ఒక గంట పడుతుంది.మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి ఆ సమయం!! లేదంటే సునాయాసంగా దర్శనం అయిపోతుంది..
మీరు నంది సర్కిల్ నుంచి క్యూ లైన్ లోకి వెళ్ళే లోపు షాప్ వాళ్ళు చెప్పులు, ఫోన్లు ఇక్కడే పెట్టాలి, ముందు పెట్టడానికి లేదంటూ ఊదరగొడతారు.ఒకవేళ వారి లాకర్ ఉపయోగించుకుంటే పూల బుట్ట చేతిలో పెట్టి 1500₹ నుంచి వారి ఇష్టం వచ్చినంత వసూలు చేస్తారు.తస్మాత్ జాగ్రత్త!! క్యూ లైన్ లోకి వెళ్ళాక గుడి కారిడార్ లోనే ఉచితంగా చెప్పులు, ఫోన్లు పెట్టుకునే లాకర్లు ఉంటాయి.అవి పూర్తిగా ఉచితం..లోపలే స్వామి అభిషేకానికి అమూల్ వారి ఆవు పాలు గ్లాసు పది రూపాయలు చొప్పున అమ్ముతారు. మీకు సంతృప్తి కోసం బయట కావాలి అనుకుంటే బిల్వ దళాలు,కమలం పూవులు, బంతి పూల దండలు, జిల్లేడు దండలు,శంఖ పూల దండలు దొరుకుతాయి.ఇక్కడ కూడా బేరం అనే మాట మర్చిపోకండి!!
స్వామి దర్శనం అయ్యాక కారిడార్ లోనే కాసేపు కూర్చునేందుకు ఏర్పాటు ఉంది.చల్లగా స్వామి శిఖరం చూస్తూ కూర్చోవచ్చు..
మీరు క్యూ లైన్ లో ఉండగానే దర్శనానికి ప్రత్యేకంగా తీసుకెళతాం అంటూ ఎందరో దళారులు కనబడతారు.కొంచెం జాగ్రత్త!!
దర్శనం పూర్తయ్యాక బయటికి వచ్చాక లోకల్ ఆటోలో దర్శనీయ స్థలాలు అన్నీ చూపించడానికి 500₹ ఫిక్స్ రేటు.. మీరు ఎంతమంది ఉన్నా ఆటోకు/500₹ తీసుకుని 16 దర్శనీయ స్థలాలు చూపిస్తారు..అవి కాలభైరవుడు,దండపాణి, మృత్యుంజయ మందిరం, తులసి మానస మందిరం,సంకట మోచన హనుమాన్, దుర్గా మందిరం,త్రిదేవ మందిరం, గవ్వలమ్మ గుడి, ఇస్కాన్ మందిరం, వ్యాస కాశీ (కాశీ రాజు కోట), అఘోర మందిరం, బిర్లా మందిరం, మార్కండేయ మందిరం, సారనాథ్, బిందు మాధవుడి మందిరం, స్వామి నారాయణ్ మందిరం...
ఇవన్నీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నాలుగు గంటల వరకు మూసేసి ఉంటాయి..ఒంటి గంటకు ముందు గానీ, నాలుగు గంటలకు తర్వాత గానీ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం!!
గవ్వలమ్మ గుడిలో ఓ గవ్వ ప్రసాదంగా ఇస్తారు కానీ అది ఆవిడ చెంతనే వదిలేయాలి..మనతో ఇంటికి తీసుకుని రాకూడదు అని కొందరు పెద్దలు చెబుతారు!!
*******(ఇంకా ఉంది)*******
Comments
Post a Comment