మా కాశీ మజిలీ కథ (2)
(ఇప్పుడు అసలు కథ)
టికెట్లు బుక్ అయ్యాయి..ఒక తీరం దొరికింది అనుకున్నాము!!
ప్రయాణం దగ్గర పడే కొద్దీ నా ఆరోగ్యం,మా నాని ఆరోగ్యం కుంటు పడుతూనే ఉన్నాయి.ఒకటే ఆయాసం, మందులు వేసుకునేందుకు కూడా ఓపిక లేనంత నీరసం.తినలేము,తాగలేము,లేవలేము. ఒకానొక దశలో ఇహ అడుగు వేయలేను అనేంత దుఃఖం. స్వామి ఎందుకో పరీక్షిస్తున్నాడు.అసలు మనల్ని కాశీ రానిస్తాడో లేదో,ఏ పాపం చేసామో అనే బాధ ఎక్కువ అయిపోయింది. ఏ బాధ కలిగినా ముందు నోటి వెంట, మనసులో అప్రయత్నంగా వచ్చే మాట, ఆలోచన అమ్మే కదా!! అందుకే నా బాధంతా అమ్మకి చెప్పుకున్నా..
కాశీలో అడుగు పెట్టాలి అంటే కాలభైరవుడి అనుమతి ఉండిల్సిందే.ఆయన ఆజ్ఞ,దయ లేకుండా కాశీ పరిసర ప్రాంతాల్లో కూడా కాలు పెట్టలేము. ప్రతి రోజూ కాలభైరవాష్టకం వినడమో, ఓపిక ఉంటే చదవడమో చేయమని మా అమ్మ చెప్పింది. ఇక అదే నాకు సముచితం అనిపించి రోజూ వింటూ, వీలున్నంత పారాయణ చేసుకున్నా..
ప్రయాణం చేయాల్సిన తేదీ రానేవచ్చింది. లగేజీ ముగ్గురికి ఆరు బ్యాగులు అయింది. అలాగే మందులు వేసుకుని ఇక్కడి నుండి వందే భారత్ నాగ్ పూర్ వరకు ఎక్కాం.ఎక్కాక కాస్త టీ/కాఫీ ఉంటే గానీ మా వారికి ప్రయాణం చేసినట్టు ఉండదు.ఎప్పుడో రీల్స్ లో రైల్ రెస్టో యాప్ గురించి విన్నా అని గుర్తొచ్చి ఆ యాప్ లో కాజీపేట లో కాఫీ ఆర్డర్ ఇచ్చా.. రెండున్నర గంటల సమయంలో వేడి వేడి కాఫీ కాజీపేట స్టేషన్ చేరుతుండగానే చేతికి అందించాడు డెలివరీ బాయ్.వేడి వేడి కాఫీ తాగి హాయిగా నిద్రపోయా నేనైతే!!
ఎనిమిది గంటలకు నాగ్ పూర్ చేరాల్సిన వందే భారత్ తొమ్మిదింటికి చేరింది. తెల్లవారుజామున రెండు గంటలకు ముజార్ ఫిర్ నగర్ ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ ఎక్కాలి నాగ్ పూర్ లో. కానీ ఆ బండి ఐదు గంటలు లేటుగా తెల్లవారుజామున ఏడింటికి వచ్చింది. మేము ముందు నుంచి అనుకున్నట్టుగానే "నాగ్ పూర్ లో రాత్రి బస" నిజమైంది అనిపించి నవ్వుకున్నాం. మేము ఎక్కువగా విశ్వసించే మాట కూడా "యత్భావం తత్భవతి". ఎన్ని సార్లు కాశీ.. కాశీ అనుకున్నామో అన్ని సార్లు "నాగ్ పూర్ లో రాత్రి బస" అని కూడా అనుకుని ఉంటాం. సరిగ్గా అలాగే జరిగింది. ఆ వెయిటింగ్ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ లో అందరి రైళ్ళూ ఆలస్యమే ఏమో మరి!! జనాలు కాళ్ళకు, వేళ్ళకు తగిలేంత మంది ఉన్నారు. నాని ఏమో ఊపిరి ఆడటం లేదు, బయటికి వెళ్ళి పోదాం అని ఏడుపు.అసలే మన భారతీయ రైల్వే స్టేషన్ల శుభ్రత పాటించడం విషయంలో కొంచెం వెనుకబడి ఉంటాం కాబట్టి ఒకటే కంపు.పైగా దొరక్క దొరక్క దొరికిన సోఫాలో మేము ముగ్గురిలో ఎవరు లేచినా కూర్చుండిపోవడానికి జనాలు పుష్కలంగా ఉన్నారు... ఇలాంటి పరిస్థితుల్లో లఘుశంక కు వెళ్ళడానికి కూడా భారీ శంక మాకు!!
ఈశ్వరా అనుకుంటూ బండి ఎక్కి కూర్చుందాం అనుకుంటే మా ముగ్గురి బెర్తులు పైనే.కింద ఎవరినైనా అడిగి చూద్దాం అనుకుంటే డెబ్భై సంవత్సరాల పెద్ద వారు ఉన్నారు.పోనీ సైడ్ బెర్త్ చూస్తే రివటలా ఉన్న కుర్రాడు కనిపించాడు.వెంటనే "ఆప్ ఊపర్ జా సక్తే? బచ్చా డర్ రహే" అని అమాయక మొహంతో అడిగానేమో ఆ అబ్బాయి "ఠీక్ హే" అనుకుంటూ పైకి ఎక్కేసాడు.హమ్మయ్యా అనుకుని నేనూ,నానీ ఒక బెర్త్,పవన్ గారు పైన బెర్త్ ఎక్కగానే అసిస్టెంట్ వచ్చి కొత్త దుప్పట్లు,దిళ్ళు, కప్పుకోవడానికి కంబళ్లు ఇచ్చి బెర్త్ దగ్గర ఉన్న చెత్త అంతా తీసేసి శుభ్రం చేసేశాడు.తొమ్మిది గంటల వరకు సూర్యోదయం చూసి కాఫీలు తాగి కూర్చున్నాం...
ఇటార్సీ రాగానే "ఇడ్లీ చట్నీ వడ సాంబార్" అని ఓ పది మంది హడావుడిగా తిరిగేస్తూ "ప్యాంట్రీ నై హే..ఖానా నై మిల్తా" అంటూ భోజనానికి కూడా ఆర్డర్ తీసేసుకుంటున్నారు. సరే ఇడ్లీ అయితే నాకు, నానికి కాస్త తేలికగా ఉంటుంది అని పవన్ గారు మా ముగ్గురికీ కలిపి తీసుకున్నారు.తీరా తెరిచి చూస్తే అందులో ఇడ్లీలు లేవు, చట్నీ లేదు.వడలు మాత్రం తలకు కొడితే బొప్పి కట్టేలా ఉన్నాయి.ఇక ఆ సాంబారు పేరుతో ఇచ్చిన ద్రవం గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయనక్కర్లేదు మనం..ఈ పరిస్థితుల్లో "ఖానా" బుక్ చేసే సాహసం చేయలేదు మేము.. పులిహోర,ఓ కేకు, కాసిని గులాబ్ జామూన్ వెంట తీసుకెళ్ళా కాబట్టి సరిపోయింది!! మా నానికి పళ్ళు ఇంకా రాలేదు కాబట్టి ఆ మెత్తటి ఆహారం తప్పదు కదా...
ఇక తెల్లవారుజామున నాలుగు గంటలకు బెనారస్ - మొగల్ సెరాయ్ స్టేషన్ లో దిగగానే మంచు దుప్పటి కనుచూపు మేర ఏమీ కనబడకుండా చేసింది.. అక్కడే వేడి వేడి టీ-నీరు ఆవిరి కక్కుతోంది ఏమో చూడగానే తాగాలనిపించింది..తాగి చూస్తే వేడి వేడి నీళ్ళలో పంచదార వేసుకొని తాగినట్టే ఉంది. ఏమీ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం కదా మరి!!
మా చలి, వణుకుడు చూస్తున్న ఆటో అతను దగ్గరగా వచ్చి బేరం కుదుర్చుకుని సామాను మోస్తూ పరుగులు పెట్టేస్తున్నాడు.అప్పుడే బండి దిగామేమో కాళ్ళు కదలనని మొరాయిస్తూ ఉన్నాయి.వాడి చేతిలో సామాను ఉంది కాబట్టి పరుగులు తప్పలేదు!!
** ఎంత వ్యామోహం వస్తువుల మీద?? బరువే అయినా,మోయలేకపోయినా, భారం మాత్రం ఎంత అతుక్కుని ఉంటుందో తెలిసిన క్షణం అది..**
ఆ ఆటో అతను తీసుకెళ్ళే దారి, అతని వాలకం, ఆ చీకటి ప్రభావం ఏమోగానీ కొంచెం భయపడ్డాను.మా ఫ్రెండ్స్ కేదారేశ్వర ఘాట్ వద్ద రూంలో ఉన్నారు, పొద్దున్నే వాళ్ళని కలవాలని ఒక ఫేక్ ఫోన్ కాల్ చేసాం.తర్వాత గూగుల్ మ్యాప్ లో అతను వెళుతున్న తోవ సరైనదే అని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నాం!!
అతని సిఫార్సుతో ఓ రూం ఇప్పించాడు.ఆటోలు, ఆహారం, నీళ్ళు దొరికే సెంటర్ లోనే రూం దొరికింది.దేవ దీపావళి సందర్భంగా కాశీ అంతా రూపాయికి పది రూపాయలు వసూలు చేస్తుండటం విశేషం..ఆ ఆటో అతనే మంచి ఛాయ్ ఇప్పిస్తానని దగ్గరలో ఉన్న టీ ఇప్పించాడు. ఎంత తేడా?? స్టేషన్ లో తాగిన వేడి నీళ్ళకి- ఇప్పుడు ఇతను ఇప్పించిన దేశీ పాల టీ కి?? ఇంకో రెండు ఛాయ్ లు తాగి రూం కి వచ్చేశాం!!
ఉదయం పది గంటల తర్వాత ఊరికే ఊరిలో ఏం ఉందో చూద్దాం అని బయల్దేరిన మాకు విశ్వనాథుని మహా లఘు దర్శనం ఇప్పిస్తానని ఒకతను తనంతట తానే వచ్చాడు.. ఐదువందల క్యూ లైన్ లో విఐపిల మార్గంలో ఐదు నిమిషాల్లో అద్భుతమైన దర్శనం ఇప్పించాడు.అలాగే కాశీ అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్ల దర్శనం కూడా చాలా దగ్గరగా దరిదాపుగా లోపలికి తీసుకువెళ్ళి మరీ చూపించాడు.. అందుకు తగ్గ పైకం కూడా పుచ్చుకున్నాడు.. అయితే నాకు స్పర్శ దర్శనం కావాలని అడగడంతో పౌర్ణమి తరువాత ఇప్పించగలను అమ్మా, ఇప్పుడు ఈ రష్ లో అసాధ్యం అని చెప్పేశాడు. నిజమే ఎంత జనం..ఎంత జనం!! కానీ ఆ కాశీ మహా క్షేత్రంలో ఖాళీగా ఎప్పుడు ఉంటుందని??
మర్నాడు బోటింగ్ అంటూ గంగా హారతి స్పెషల్ అని అన్ని ఘాట్ ల విశిష్టత చెబుతూ, రోమాలు నిక్కబొడుచుకునే గంగా హారతి, ఢమరుక నాదాల మధ్య, జటాటవీగలజ్జల అని వినబడుతూ ఉంటే గంగమ్మకు పూల హారతి, కర్పూర హారతి,ధూప హారతి ఇస్తుంటే ఆ తన్మయత్వం ఎవరికి వారు అనుభూతి చెందాల్సిన పండుగే.. మాటలో, ఫోటోలో, వీడియోలో వర్ణించే అనుభవం కాదు అది!!
ఇక పౌర్ణమి రోజున ఉదయమే గంగా తీరానికి చేరుకున్న మాకు వేద విద్యార్థుల పఠనం, వారి గంగా స్తుతి, సూర్య నమస్కారాలు చూసి ఇది కదా కాశీ వైభవం అనిపించింది..గంగా స్నానం, మణికర్ణిక స్నానం చేసుకుని, సాయంత్రం దేవ దీపావళి మహోత్సవం లో పాల్గొనేందుకు సిద్ధం అయ్యాం. ఎంత మంది జనం అనేది కంటికి, లెక్కకు అందని విషయం ఆ రోజు!!
సాయంత్రం నాలుగు గంటలకు రూం కి చేరిన మాకు ఆరు గంటల కన్నా ముందే దేవ దీపావళి మహోత్సవానికి వెళ్ళాలని సంకల్పం. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే మంచిదే కదా!! కానీ నా తలరాతలో ఏముందో తెలియదు కానీ రూంకి చేరిన దగ్గర నుంచి వాంతులు, జ్వరం,చలితో కళ్ళు తెరవలేని దుస్థితిలోకి వెళ్ళిపోయా. ఆ రోజు పొద్దున్న నుండీ తిండి-తిప్పలు లేవు ముగ్గురికి.పిల్లవాడు ఆకలి అంటూ ఏడుపు.నా చెవులకు నాని ఏడుపు వినబడుతోంది కానీ శరీరం లేవటం లేదు. "వాడికి ఏదైనా తినిపించండి" అంటూ కలవరిస్తూ ఉంది మనసు కానీ అది మాటగా బయటికి వచ్చి మా వారికి చేరే పరిస్థితి లేదు. మనసులో అసలు వచ్చిందే ఈ దేవ దీపావళిలో అసంఖ్యాక దీపారాధన కోసం.కానీ ప్రాణం శరీరం విడిచి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంది. సాయంత్రం ఆరు దాటుతూ ఉండగా చెవులకు గంగా తీరం నుంచి టపాసుల శబ్దం, ఢమరుక నాదాలు,శంఖ ధ్వని వినబడుతున్నాయి. ఎలాగైనా లేచి వెళ్ళాలి అని బలవంతంగా లేచా కానీ శరీరం నా మాట వినటం లేదు సరి కదా మనుషులు ఇద్దరిద్దరుగా, అటూ ఇటూ కదిలిపోతూ నా కళ్ళు తిరిగిపోతూ అలాగే పడిపోయాను.. మనసులోనే గుక్క పట్టి ఏడుస్తున్నా!! ఆ శివయ్యకే మొరపెట్టుకుని భావురుమని ఏడుస్తున్న క్షణాలు అవి..
ఒకానొక దశలో ఈ పాన్ లు తిని, ఇక్కడే ఉమ్మేస్తూ, ఇక్కడే ప్రయాణికులను మోసం చేస్తూ బ్రతుకుతున్న వారందరినీ నీ ఒడిలో చేర్చుకున్నావు.ఎక్కడి నుంచో నీ కోసం వచ్చిన నన్ను రానీయవా శివా అని బయటకే పెద్దగా ఏడ్చేశాను..మా వారు నా పరిస్దితి చూసి "ఆరునూరైనా నువ్వు దీపారాధన చేస్తావు.అర్ధరాత్రి అయినా సరే ఆ శివయ్య ముందు నిన్ను నుంచోబెడతా. ముందు నువ్వు కోలుకో" అంటూ నా కోసం నానితో సహా అలా నా పక్కనే కూర్చుని ఉన్నారు!!
సుమారు రాత్రి తొమ్మిది గంటలకు నాకు పూర్తి స్పృహ వచ్చింది.ఇప్పుడు కూడా లక్ష పైన దీపాలు, ప్రమిదలు,ఆవునెయ్యి దొరుకుతాయో లేదో అని ఏడుస్తూ కాశీ వీధుల్లోకి వచ్చా!! ఆ శివయ్య పెట్టిన పరీక్ష ఆయనే గట్టెక్కించాడు అన్నట్టు దీపారాధన సామాగ్రి అంతా దొరికింది. గబగబా మాకు కేటాయించిన కేదారేశ్వరుని గుడి ముందు మెట్ల మీద దీపాలు వెలిగించి,నా కన్నీటిని ఆపుకోలేక ఆయన పాదాలకు మనసులోనే అభిషేకం చేసుకున్నా!!
**ఆయన ఆజ్ఞ లేకుండా సంకల్పం మనదే అనుకుంటే ఆయన దయ కోసం భావురుమనిపించగలడని తెలుసుకున్న రోజు**
ఆ తర్వాత చాలా సేపు ఆ దేవ దేవుని దీపావళి వెలుగులు మనసులో నింపుకుని గూటికి చేరాం!!
తెల్లారాక మాకు స్పర్శ దర్శనం ఇప్పిస్తానని చెప్పిన మనిషి జాడలేడు. ఇక చేసేది లేక సైట్ సీయింగ్ చూసుకుని ఆ రోజంతా గడిపేశాం. మర్నాడు ఉదయం ఎలా అయినా స్పర్శ దర్శనం చేసుకోవాలి అని పట్టుబట్టిన నాకు మా నాని రూపంలో మరో పరీక్ష ఎదురైంది.విపరీతమైన జ్వరం, తలనొప్పి అని ఏడుస్తూ మధ్యాహ్నం దాటే దాకా చాలా ఏడ్చి బాధపడ్డాడు.ఈ రోజు దాటితే తెల్లారి ఆరింటికి మా తిరుగు ప్రయాణం.ఈ రోజు కూడా నన్ను లోపలికి రానివ్వడా అని మళ్ళీ కుళాయి తిప్పి ఏడుస్తూ ఉండగా ఎందుకో మనసులో "ఆయన నివాసానికి వచ్చి ఆయనకి నేనేం పట్టుకుని వచ్చాను?? అసలు ఆయనకి నేనేం ఇవ్వగలను?? నేను ఏ పాపం చేసి ఎరుగను,ఒక వేళ ఏదైనా తెలిసో తెలియకో చేసిన పాపం ఉన్నా నన్ను క్షమించి ఆయన దర్శనం ఇవ్వొచ్చు కదా" ఇలా మనసు మెలి తిప్పుతూ ఉన్న క్షణం స్వామికి ఇన్ని బిల్వ పత్రాలు ఇవ్వలేనా అనుకుంటూ మా నానికి మందులు వేసి, లేపి బలవంతంగా తీసుకొచ్చా!!
రోడ్డు పొడవునా నాని నిద్రావస్థలోనే ఉన్నాడు.ఏదైనా తింటావా అంటే వద్దని ఏడుపు.లస్సీ మాత్రం బెదిరించి తాగించా.కాసేపు పవన్ గారు, కాసేపు నేను వాడిని ఎత్తుకుంటూ బిల్వ దళాలు ఓ పెద్ద కవర్ నిండా పట్టుకుని, ఇక్కడి నుంచి స్వామి వారికి తీసుకెళ్ళిన పంచె కూడా తీసుకుని గేటు నెంబర్ 4 కి చేరాం..అంత బిల్వమా అంటూ అడుగడుగునా చెకింగ్ చేశారు.నానా హంగామా తర్వాత మొత్తానికి లోపలికి పంపారు కానీ స్పర్శ దర్శనం లేదని చెప్పారు!!
నా భాగ్యం ఇంతేనా స్వామి అనుకుని ఐదారు కిలోమీటర్ల క్యూ లైనులో అలా మనసుకి వచ్చిన శ్లోకాలు, స్తోత్రాలు చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉంటే ఒక పండిట్ మాత్రం మనిషికి 2,500₹ ఇస్తే స్పర్శ దర్శనం కోసం ప్రయత్నం చేస్తాను, దర్శనం కుదరకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ వచ్చాడు. ఇక నా మనసులో అతనికి 5000₹ ఇచ్చేయడం తప్ప ఇంకో మార్గం కనబడటం లేదు.మా వారు మాత్రం ఆలోచన చేస్తున్నారు.ఆయన్ని కాదని నేను ముందడుగు వేయలేను, వేయను!!
ఆ పండిట్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడి లాగా మా చుట్టూనే తిరుగుతున్నాడు.ఇక అడగనిదే అమ్మ కూడా పెట్టదని గుర్తొచ్చి మా వారిని "ప్లీజ్" అన్నాను అంతే!! మనసుని అర్థం చేసుకున్న మనిషికి ఇంతకన్నా ఏమీ చెప్పక్కర్లేదు ఏమో వెంటనే ఆ పండిట్ కి పైకం చెల్లించారు. ఆ గుడి కొత్త కారిడార్ లోనే ఉన్న కృష్ణ మందిరం పక్కన మమ్మల్ని కూర్చోబెట్టాడు.అతను ఆ విశ్వనాథుని ఆలయంలో ప్రధాన అర్చకుల వారి వెనకాలే తిరుగుతూ, కాళ్ళకు దండాలు పెడుతూ మమ్మల్ని చూపిస్తున్నాడు. ఓ గంట సేపు మమ్మల్ని అలా కూర్చోబెట్టి ఆ పండిట్ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు.ఆ గంట సేపు నా మనసులో అలజడి అంతా ఇంతా కాదు.ఆయన నన్ను కరుణిస్తాడా లేక ఇదే నీ జీవితానికి ఎక్కువ అని పంపేస్తాడా అని పలురకాలుగా రోదిస్తోంది మనసు.. అక్కడే కూర్చుని కాలభైరవాష్టకం పైకి చదువుతూ, ఏడుపు ఆపుకుంటూ, కళ్ళు తుడుచుకుంటూ ఆనతినీయరా అంటూ వేడుకున్నా!!
ఒక్క క్షణంలో ఆ ప్రథాన ఆలయ బ్రహ్మ గారు దయతలిచి రమ్మని పిలిచి, అక్కడ ఉన్న పోలీసులకు,ఆలయ సిబ్బందికి మమ్మల్ని లోపలికి పంపమని ఆజ్ఞాపించారు.. "ఓ బేల్ భీ ఛడానేదో"( ఆ బిల్వ పత్రాలను కూడా వేయనీయండి) అంటూ లోపలికి పంపారు..ఇహ నా మనసులో ఏ భావం లేని క్షణాలు అవి!!
ఆయన ఎలా రప్పించుకోవాలో అలా రప్పించుకున్నాడు..నా మనసులో అప్పటి దాకా ఉన్న కోరిక,బాధ, అలజడి ఏమీ లేని స్థితిలో ఉన్నా!!
బయటికి వచ్చాక నా ఆనందానికి అవధులు లేవు.. అక్కడి నుంచి రాబుద్ధి కూడా కాలేదు.అత్యాశే అయినా నా జీవితానికి అదే పరమార్థం అనిపించింది..
ఇహ వెను తిరిగి మళ్ళీ పట్టాలు పట్టుకుని ప్రయాణం చేసి ఇల్లు చేరాం.. కానీ మా ముగ్గురి మనసులు అక్కడే, ఆయన పాదాల చెంత ఉంచి వచ్చాం!!
ఇంత ఆనందాన్ని మూట కట్టి పంపుతాడనే కాశీని "ఆనందవనం" అంటారు..
ఎన్నో వైరాగ్యాలను కలిగించే ఆ మహా స్మశానంలో మన అహం, కోపం,బాధ, కోరికలు, ఈర్ష్య, ద్వేషాలు కూడా వదిలేసి రావాలని ప్రయత్నం చేసే జీవుడే ధన్యుడు..మోక్ష సాధకుడు!!
****హర హర మహాదేవ శంభో శంకర****
తెల్లవారి ఝాము 4 నుండి సూర్యదేవుడు మనల్ని పలకరించేంత వరకు గంగమ్మ చెంత మణికర్ణిక ఘాట్ ని చూస్తూ నిశబ్దంగా కూర్చుంటే వచ్చే ఆ అనుభూతిని వర్ణించలేము అక్క... హర హర మహాదేవ్ .. మీ కాశీప్రయాణం ఆధ్యంతం కండ్లకు కట్టినట్టు చూపించారు ! హర హర మహాదేవ్
ReplyDelete