కాశీ ప్రయాణం ఎలా చేయాలి!!(రెండో భాగం)

 మొదటి భాగంలో కాశీలో ఆటోలో దర్శనీయ స్థలాల గురించి చెప్పాను కదా!!

ఈ రోజు కాలినడకన చూడవలసిన దర్శనీయ స్థలాల గురించి చెప్తాను. కాలినడకనా?? హమ్మో.. మేము నడవలేము అనుకోకండి.. అన్నీ అక్కడ అక్కడే పక్కనే ఉంటాయి. ఒక రకంగా మహా అయితే అన్నీ కలిపి 2 కిలోమీటర్లు కూడా ఉండవు.కాకపోతే కాశీ అంటేనే ఇరుకు సందులకు పెట్టింది పేరు కాబట్టి ఏ రిక్షా రాదు. ఆ ఇరుకు సందుల్లోనే వ్యాపారస్తులు ద్విచక్ర వాహనాల రాకపోకలు కూడా ఉంటాయి.మనమే కాస్త చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి!!

ఈ 12 ఆలయాలు కూడా కాలభైరవుడి ఆలయం సందర్శించిన తరువాత మాత్రమే వెళ్ళాలి.. లేదంటే పుణ్యం మన ఖాతాలోకి రాదు!!

ఆ ఆలయాలు విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణ ఆలయం, విశాలాక్షి ఆలయం(శక్తి పీఠం), గంగా స్నానాల ఘాట్ (వీటి వివరాలు ఇంకా ఉన్నాయి),డుండి గణపతి, సాక్షి గణపతి, చింతామణి గణపతి, గౌరీ కేదారేశ్వరుడు, వారాహి మాత ఆలయం , తిలా భండేశ్వరుడు, బృహస్పతి ఆలయం,బడే హనుమాన్ ఆలయం..

ఇవన్నీ ఒక రోజు పెట్టుకుంటే సరిపోతుంది..

అన్నపూర్ణ ఆలయంలో పురోహితులు దక్షిణ ఇస్తానని చెప్పి

అమ్మవారి అంతరాలయం దాకా వెళ్లిపోవచ్చు.. లేదంటే మామూలు దర్శనం కూడా చేసుకోవచ్చు!!

కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గర అడిగి మరీ సంకల్పం చెప్పించుకోండి.. అమ్మవారి తరుఫున రవికె, బొట్టు, ఫోటో అందిస్తారు.ఆ గుడికి కుడి పక్కనే లోపలికి వెళితే నవగ్రహాలు,శివ లింగం, అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంటాయి.అక్కడే కిటికీ లో కూర్చుని ఎదురుగా చూస్తే అమ్మవారి శిఖర దర్శనం లభిస్తుంది.. తప్పకుండా చూడండి!!

డూండీ గణపతి ఆలయం కాశీలో ఉన్న 56 గణపతుల విశిష్ట ఆలయాలలో ముఖ్యమైనది.గేట్ 1 దగ్గరే ఉంటుంది.. తప్పకుండా చూడండి!!

సాక్షి గణపతి ఆలయము సందర్శిస్తేనే కాశీ యాత్ర ఫలితం మన ఖాతాలో పడుతుంది.ఊర్ధ్వ గతులు పొందడానికి ముందు జీవుడు కాశీ యాత్ర చేశాడా లేదా అని భగవంతుడు ప్రశ్నించగానే ఈ సాక్షి గణపతి "అవును ఫలానా రోజున ఈ జీవుడు కాశీ యాత్ర చేశాడు" అంటూ సాక్ష్యం చెబుతాడు.కాశీలో ఎన్ని సార్లు దర్శనం చేసుకున్నా, ఎన్ని గుడులు తిరిగినా ఈయన సాక్ష్యం చెప్పనిదే మనకి ఈ యాత్ర ఫలితం ఉండదు!! కాబట్టి తప్పకుండా ఈయన దగ్గర అటెండెన్స్ వేయించుకోవాలి..

చింతామణి గణపతి పేరుకు తగ్గట్టే మన ఆలోచనలు, కోరికలు తీర్చేసే మహారాజు!! పెద్ద విగ్రహం కళ్ళ నిండా నింపుకొని మనసులో ఆలోచనలు ఆయనకు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుస్తాడు..

గౌరీ కేదారేశ్వరుల ఆలయం స్వయంభూ లింగం.అభిషేకం,అర్చన మన చేతులతో చేస్తూ స్పర్శ దర్శనం సౌలభ్యం ఉంది..పైగా బద్రి కేదార్ నాథ్ ఆలయ దర్శనం చేయాలని అనుకున్నవారు ,చేయలేక పోయిన వారు ఈ లింగాన్ని దర్శిస్తే బద్రి -కేదార్నాధులను చూసినట్టే అని ప్రతీతి!! ఈ ఆలయం లోపలే 56 గణపతి అని కాశీలో ఉన్న 56 గణపతుల దర్శనం ఈ ఒక్క గణపతి దర్శనంతో లభిస్తుంది..లోపలే మధుర మీనాక్షి, బద్రీనాథ్ -మహాలక్ష్మీ దేవతా మూర్తులు కూడా ఉంటాయి.. అన్నీ చూడండి!!

వారాహి మాత దర్శనం ఉదయం 4 గంటల నుంచి 9గంటల వరకు మాత్రమే ఉంటుంది.రాత్రి అంతా నగర పాలన చేసి అమ్మ సేదతీరే సమయంగా గుడి మూసి ఉంచుతారు.. కాబట్టి ఈ వేళల్లోనే అమ్మవారి దర్శనం లభిస్తుంది!!

తిలా భండేశ్వరుడు:- నువ్వు గింజంత శివ లింగం స్వయంభూగా ఉద్భవించి రోజు రోజుకూ పెరుగుతూ భక్తులకు సులభంగా వారాలు ప్రసాదించే లింగం ఇది!!

బృహస్పతి ఆలయం:- గురు గ్రహ దోషాలు, అనుగ్రహం కోసం ఈ ఆలయం సందర్శించాలి.. ఉత్తమ గతులకు మంచి గురువును పొందే అదృష్టం కూడా ఈ ఆలయ సందర్శనంతో కలుగుతుంది అని చెబుతారు!!

బడే హనుమాన్ ఆలయం:- కొండంత ఆంజనేయ స్వామి దర్శనం చాలా ప్రసస్త్యం..

ఈ ఆలయాలు అన్నీ కాలినడకన మాత్రమే చూడగలం అని మాత్రం గుర్తు ఉంచుకోవాలి!!

ఇక పోతే గంగా ఘాట్ ల గురించి చెప్పడానికి మరో భాగం తప్పదు..

*****(ఇంకా ఉంది)*****



Comments

Popular posts from this blog

మా కాశీ మజిలీ కథ..(1)

కాశీ ప్రయాణం ఎలా చేయాలి!! (మొదటి భాగం)

మా కాశీ మజిలీ కథ (2)