గంగా తీరంలో ఏ ఘాట్ లలో స్నానం చేయాలి??
గంగోత్రి లో గోముఖం నుంచి చుక్క చుక్కగా వస్తూ అలకనందగా ఉధృతిగా ప్రవహిస్తూ వారణాసి,ప్రయాగ త్రివేణీ సంగమం వరకు గంగమ్మ నృత్యం ఓ అద్భుతమైన ప్రవాహం.ఎన్నో చోట్ల ప్రవహించే గంగా నది కాశీలో మాత్రం అత్యంత పవిత్రమైన నదిగా మన శాస్త్రాలు చెబుతున్నాయి.అన్ని నదులకన్నా ఈ గంగానది మాత్రమే ఎందుకు ప్రత్యేకం అని ఎందరో శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలు విడుదల చేశారు.
సైన్స్ ప్రకారం ఒక మైక్రోబయాలజిస్టుగా చెబుతున్న ఈ విషయాలు నా సొంత వ్యాఖ్యలు కావు.నిజం నిరూపించిన, శాస్త్రీయ ఆధారాలు ఉన్న పరిశోధన ఫలితాలు ఇవి..
సాధారణంగా నీరు కలుషితం అవడానికి కారణం నీటిలో పెరిగే బ్యాక్టీరియా అని మనందరికీ తెలుసు.అయితే రెండు రోజులు మన నీళ్ళ సీసాలో,బిందెలో నిలువ ఉంచిన నీరు పాచిపోవడం మనం చూస్తూనే ఉంటాం.రకరకాల ఫిల్టర్లు, ఆర్ ఓ లు వాడుతూ మనల్ని మనం ఆ నీటి బ్యాక్టీరియా నుంచి తప్పించుకుంటూ ఉంటాం. ఇలాంటి బ్యాక్టీరియా చాలా సహజంగా మన నదుల్లో, చెరువుల్లో, బావుల్లో కూడా ఉంటుంది. అయితే జీవ నదుల్లో ఈ బ్యాక్టీరియా శాతం కొంచెం తక్కువ ఉంటుంది.కానీ వాటి ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటుంది.అందుకే పుష్కరాలకో,తీర్థాలకో వెళ్ళి వచ్చిన కొందరికి చర్మ సంబంధిత వ్యాధులు, లేదా అమిబియాసిస్ లాంటి అనారోగ్యాలో వస్తూ ఉంటాయి..
కానీ గంగా నదిలో ఉండే బ్యాక్టీరియోఫేజ్ లు ఒక రకమైన వైరస్లు.ఇవి కేవలం బ్యాక్టీరియాను ఆహారంగా చేసుకుని జీవిస్తూ ఉంటాయి.ఇవి ఉన్న ప్రాంతంలో బ్యాక్టీరియాను బ్రతకనివ్వవు. ఇవి బ్యాక్టీరియాకు తప్ప ఎవరికీ హాని కలిగించవు..ఈ రకంగా గంగా నదిలో నీరు తనని తాను ప్రక్షాళన చేసుకుంటూ ఉంటుంది. ఈ విషయం మీరు గూగుల్ లో కూడా చూడవచ్చు!!
అందుకే గంగ నీరు మన వాళ్ళు ఇంటికి తెచ్చుకున్నా పాడవటం కానీ, పాచి పట్టడం కానీ జరగదు.ఎన్ని సంవత్సరాలైనా ఆ నీరు అలాగే ఉండటం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం.
అయితే కలకత్తా వంటి ప్రాంతాల్లో కాలుష్యం, ప్లాస్టిక్,తదితర కారణాల వల్ల ఈ బాక్టీరియోఫేజ్ లు నశించి పోయి బ్యాక్టీరియా సంఖ్య పెరిగి నీరు కలుషితం అవుతోంది.స్నానాలకు కొన్ని ఘాట్ లు మాత్రమే ఉపయుక్తంగా ఉన్నాయి కలకత్తాలో. ఇకపోతే హరిద్వార్, రిషికేష్ వంటి ప్రాంతాల్లో తీవ్ర ఉధృతంగా ప్రవహిస్తుంది గంగా నది.ఇక్కడ కూడా కొన్ని ఘాట్ లలో మాత్రమే స్నానానికి అనువుగా ఉంటుంది.
ఇక కాశీలో ఎన్నో యుగాల నుంచి బ్రహ్మ, విష్ణుతో సహా సమస్త దేవతలూ మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి గంగా నదీ స్నానం,కాశీ వాసం చేస్తూనే ఉన్నారు అనేది వేద వాక్కు.అందుకే కాశీలో ఉన్న గంగా నది స్నానం, నదీ పూజ చాలా ప్రాశస్త్యం పొందింది.అందుకే గంగా అమ్మవారికి సుప్రభాత సేవ మొదలు సాయంత్రం హారతి వరకు ఎంతో సాంప్రదాయకంగా జరుగుతున్నాయి ఈనాటికీ!!
ఇకపోతే ప్రస్తుతం అభివృద్ధి, ప్రక్షాళన జరుగుతున్న గంగా తీరంలో ఏ ఏ ఘాట్లలో స్నానం చేస్తే మంచిది అనే విషయానికి వస్తే ముందుగా గంగా ఘాట్ ల సంఖ్య 85 వరకు ఉన్నాయి..ఆయా ఘాట్లలో జరిగిన చారిత్రాత్మక ఘట్టాలు, మార్పులు, అభివృద్ధి ఆధారంగా వాటి పేర్లు నిర్ణయించారు..
వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి:-
అస్సీ ఘాట్:-
ఇది అస్సీ నది మొదలయ్యే మొదటి ఘాట్.ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతాయి.ముఖ్యంగా దేవ దీపావళి మహోత్సవానికి లేజర్ షోలు, సంగీత విభావరులు, భజనలు,ఆట పాటలు పెద్ద ఎత్తున జరుగుతాయి.. ఇక్కడి స్నానం మంచిదని చెబుతారు!!
హరిశ్చంద్ర ఘాట్:-
సత్య హరిశ్చంద్రుడు(త్రేతాయుగం)విశ్వామిత్రుడి పరీక్ష వల్ల కాటి కాపరిగా చేసిన స్థలం ఇదే. సత్యవతిని మరిచి తన కన్న కొడుకు అంత్యక్రియలు చేసిన ప్రాంతం ఇదే. ఆ తర్వాత ఆయన విశ్వామిత్రుడి పరీక్షలో సఫలం అవడం, మోక్షం పొందడం వంటి ఘట్టాలు ఇక్కడే జరిగాయి..మన చరిత్రలో యుగాలు మారినా నిలిచిపోతున్న సత్య హరిశ్చంద్రుడి పేరున ఈ ఘాట్ నిర్మించారు.ఇక్కడ ఇప్పటికీ దేశం నలుమూలల నుంచి, ఇరవై నాలుగు గంటలూ శవాలు వస్తూనే ఉంటాయి.ఇక్కడ అగ్ని సంస్కారం జరుగుతూనే ఉంటుంది.కాశీలో ఎక్కడా అంటూ,మైలా లాంటి దోషాలు ఉండవు.విమానాల్లో సైతం మరణించిన వారి దేహాలు ఇక్కడికి పంపబడుతూనే ఉంటాయి.. "రామ్ రామ్ సత్య్ హే" అనే స్మరణతో కాశీ వీధుల గుండా హరిశ్చంద్ర ఘాట్ కి దేహాలను మోసుకొస్తూనే ఉండటం అక్కడ సహజం!! ఈ ఘాట్ కి అటు ఇటు స్నానాల ఘాట్ లు ఉన్నాయి. ఇక్కడ రుద్రభూమి లో సాక్షాత్తు శివుడే నడయాడుతాడని నమ్మి ప్రతి చితి మీద ఉన్న దేహానికి దండం పెట్టుకోవాలి.. భయపడటం, కంగారు పడటం వంటివి చేసి ఇక్కడ బలమైన నమ్మకాన్ని అవమానపరచకూడదు!!
కేదారేశ్వర ఘాట్:-
గౌరీ కేదారేశ్వర లింగం స్వయంభూగా ఉద్భవించిన ఆలయం ఉంది..ఆ ఆలయం గుండా కిందికి దిగితే వచ్చే ఘాట్ ఇది!!హరిశ్చంద్ర ఘాట్ అనుకునే ఉంటుంది ఈ ఘాట్.ఇక్కడ స్నానాలకు అనువుగా కర్రలు కట్టారు.ఆ కర్రలు దాటితే నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది అనే సూచనలు పెట్టారు.కాబట్టి సూచనలు పాటిస్తూ ఇక్కడ నదీ స్నానం ఆచరించడం చాలా మంచిది.స్నానం అంటే సబ్బులు,షాంపూలతో చేయకూడదు!! నదీ స్నానం అంటే దంపతులు అయితే సంకల్ప సహితంగా భర్త ఎడమ చేతి లో భార్య కుడి చేయి పట్టుకొని మూడు మునకలు తల వెంట్రుకలు ఆసాంతం మునిగేలా చేయాలి.ముత్తైదువులు పసుపు రాసుకుని నదిలో దిగాలి.స్నానానంతరం గంగమ్మకు దీపం, పువ్వులు,చీర,రవికె ఇలా ఏదో ఒక వాయినం ఇవ్వడం ఆనవాయితీ!! సంకల్పం లేని దంపతుల స్నానం వ్యర్థం.. దంపతులు కాని వారు మగవారైనా, ఆడవారైనా సూర్యుడికి నమస్కారం చేసుకుని, స్నానం ఆచరించి,నదిలోనే ఏదైనా తాము స్వీకరించిన మంత్రాన్ని జపించడం చేయాలి. గంగా నదిలో మంత్రానుష్టానం కోటి రెట్లు ఫలితం అని చెప్పబడింది.. ఇప్పుడు స్నానం అయ్యాక బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుభ్రంగానే ఉంటున్నాయి!!
మణికర్ణిక ఘాట్:-
మానవులకే కాదు సమస్త దేవతా మూర్తులకు ఎంతో ప్రత్యేకమైనది ఈ ఘాట్. ఈ ఘాట్ లోనే దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తుండగా,సతీ దేవి దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది.ఆ తర్వాత అమ్మ శరీర భాగాలు పలు దిశల్లో పడేలా శివుడు నాట్యం చేయడం,ఆ శరీర భాగాలు పడిన చోటు శక్తి పీఠాలుగా ఇప్పటికీ నిలిచిపోవడం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో అమ్మవారి చెవి పోగులు ఇదే ఘాట్ లో పడ్డాయని చెబుతారు కొందరు!!
మరి కొందరు శివుడు ప్రదోష వేళ నృత్యం చేస్తుండగా ఆయన కర్ణాభరణం ఇక్కడ పడటంతో పార్వతి దేవి, విష్ణు మూర్తి, బ్రహ్మాది దేవతలు అంతా అది వెతికేందుకు ఈ మణి కర్ణికలో మునిగి చూశారని, ఇప్పటికీ మధ్యాహ్నం వేళ సమస్త దేవతలూ ఇక్కడ స్నానమాచరించి వెళతారని చెబుతూ ఉంటారు.అందుకే అక్కడ మధ్యాహ్నం 12 గంటల వేళ స్నానం చేయడం ప్రసిద్ధి!!
మణికర్ణిక ఘాట్ లో కూడా నిత్యం అగ్ని సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి.ఇక్కడే ఎందరో ఉపాసకులు అంటే శక్తి ఉపాసకులు అమ్మవారిని,శివ ఆరాధ్యులు మహా శివుణ్ణి, తాంత్రిక సాధకులు ఇలా అందరూ కనబడుతూ ఉంటారు.. కానీ వారు ఎవరినీ ఇబ్బంది పెట్టేవారు అయితే కాదు!! వారి పని వారు చేసుకుంటూ ఉంటారు అంతే.. ఈ ప్రాంతంలోనే ఎన్నో కట్టెల మోపులు కూడా ఉంటాయి.. అగ్ని సంస్కారం కోసం!!
కొందరు దొంగ సాధువులు,బైరాగులు కూడా ఇక్కడ ఉంటారు.వారు డబ్బు డిమాండ్ చేస్తారు.నిజంగా సాధనా మార్గంలో ఉన్న వారికి డబ్బు అవసరం లేదు అని గుర్తు పెట్టుకోవాలి.డబ్బులు అడిగే ఏ దొంగ సాధువునీ ఉపేక్షించకుండా, వారి చేత చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
సంకల్ప సహితంగా స్నానమాచరించి, కాశీ యాత్ర చేయలేని మన వారిని తలుచుకుంటూ మరో మూడు సార్లు మునకలు వేస్తే వారు కూడా స్నానం చేసిన ఫలితం వస్తుంది అని చెబుతారు.
ఇక్కడ స్నానం చేసినా, అంత్యక్రియలు చేసినా జీవుడికి జనన మరణ బాధలు లేకుండా మోక్షం ప్రసాదిస్తాడు శివయ్య అని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి!!
సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ స్నానం చేయడం ఓ అదృష్టంగా భావించాలి..
నారద ఘాట్:-
ఇక్కడ నారదుడు స్నానం చేసి నారాయణ మంత్రాన్ని అనుష్టానం చేసారని చెబుతారు.మరి నారదుని కలహ భోజన గుణం తెలిసిన నారాయణుడు ఒకసారి ఇదే విషయాన్ని ప్రస్తావించగా నారదుడు ఇక్కడ స్నానం చేయని వారిని నేను ఏమీ చేయను, కానీ కలిసి స్నానం చేసే వారిని మాత్రం విడదీస్తానని చెప్పాడట!! అందుకే ఈ ఘాట్ లో స్నానం చేయరు.లేదా ఒక్కరే చేయాలి. అత్తా- కోడళ్ళు, భార్య- భర్త, తల్లి- పిల్లలు, తండ్రి -పిల్లలు, స్నేహితులు, చుట్టాలు ఇలా ఎవరు కలిసి ఈ ఘాట్ లో స్నానం చేసినా తగువులు జరిగి విడిపోతారని చరిత్ర చెబుతోంది.. కాబట్టి ఇక్కడ స్నానం చేయొద్దు అని చెప్పడానికే ప్రత్యేకంగా చెబుతున్నా!!
దశాశ్వమేధ ఘాట్:-
ఈ ఘాట్ ప్రత్యేకత అంతా ఇంతా కాదు.బ్రహ్మ యజ్ఞం చేసిన చోటు ఇదే. అలాగే దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేసి ఎన్నో విజయాలు సాధించిన చోటు ఇదే. ఇదే ఘాట్ లో గంగా హారతి ఘనంగా నిర్వహిస్తారు కూడా!!
సాయంత్రం అయితే ఆ వేడుక కోసం తండోపతండాలుగా జనాలు ఇక్కడ చేరడం నిజంగా ఓ పండుగే.ఆ ఆనందాన్ని కన్నులారా వీక్షించి తరించాల్సిందే తప్ప చెప్పనలవి కాదు!!
ఇక్కడ కూడా స్నానాలకు ఏర్పాట్లు ఉన్నాయి.. విజయం సిద్ధించడం కోసం ఈ ఘాట్ లో స్నానం చేస్తారని చెబుతూ ఉంటారు!!
ఇంకా అహల్య ఘాట్,రాజ్ పుత్ ఘాట్ అంటూ ఎందరో రాచరిక వైభవానికి ఆనవాళ్ళుగా ఘాట్ లు ఉన్నాయి..మీరా బాయి ఘాట్ వంటి మొన్న మొన్నటి చారిత్రక ఆధారాలు కూడా ఈ ఘాట్ లు నిలుపుకున్నాయి.. రాముడు వన వాసానికి బయలుదేరిన కేవట్ ఘాట్ కూడా ఇక్కడ చూడవచ్చు.
కానీ కొన్ని రాచరిక కట్టడాలు ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద హోటళ్ళుగా మారిపోయాయి.చాలా విలాసవంతమైన హోటళ్లు ఇక్కడ చరిత్ర దాటి తొంగి చూస్తున్నాయి.దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం రకరకాల జీవన శైలి ఉట్టిపడేలా ఈ హోటళ్ళను తీర్చిదిద్దారు.. మీరా బాయి నుంచి వాళ్ళ మరిది లాక్కుని ఆవిడని గెంటేసిన భవనం ఇప్పుడు ఒక మల్టీ నేషనల్ కంపెనీ హోటల్ గా మారి రోజుకు అక్షరాలా 80,000₹ రుసుముతో అట్టహాసంగా నిర్వహించబడటం నా వరకు నాకు వింత..!!
ఇక్కడే విశ్వనాథుని ఘాట్ నుంచి నేరుగా దర్శనం లైన్ ఉంటుంది.. లలితా ఘాట్ నుంచి శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం ఉంటుంది.. అలాగే విశాలాక్షి ఘాట్ నుంచి నేరుగా కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయంకు దారి ఉంది.అన్నపూర్ణ ఘాట్ నుంచి కాశీ అన్నపూర్ణ ఆలయానికి, కాశీ అన్నపూర్ణ అన్న ప్రసాదానికి దారులు ఉన్నాయి..
84 ఘాట్ ల విశిష్టత చెప్పడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఇక్కడితో స్వస్తి చెబుతున్న...
🙏🙏🙏...మళ్ళీ కలుద్దాం...🙏🙏🙏
...సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు...
Comments
Post a Comment